హైదరాబాద్ : దేశంలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కొంతకాలంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించట్లేదు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉంది. విమానాల్లో ప్రయాణించే చాలామంది సైతం నిబంధనలు పాటించడం లేదని కేంద్ర పౌరవిమానయాన సంస్థ గుర్తించింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు విధించింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాల్సిందేనని, లేదంటే విమానం నుంచి దించేయాలని స్పష్టం చేసింది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది.
1. విమాన ప్రయాణాల సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. మాస్కు ముక్కు కిందకు ఉండకూడదు.. సరిగ్గా ధరించాలి.
2. విమానాశ్రయ ప్రవేశద్వారాల వద్ద సీఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బంది ప్రయాణికులను గమనించాలి. మాస్క్ లేకుండా ఎయిర్పోర్టు లోపలికి ఎవర్నీ అనుమతించకూడదు.
3. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లేదా టర్మినల్ మేనేజర్ చూసుకోవాలి. ఏ ప్రయాణికుడైనా కొవిడ్ 19 నిబంధనలు పాటించకపోతే వారిని భద్రతా సిబ్బందికి అప్పగించాలి.
4. విమానంలోకి ఎక్కిన తర్వాత అందరూ మాస్క్లు పెట్టుకునేలా చూసుకోవాలి. సిబ్బంది హెచ్చరించినా మాస్క్ పెట్టుకోకపోతే ఆ ప్రయాణికులను టేకాఫ్కు ముందే విమానం నుంచి దించేయాలి.
5. ప్రయాణ సమయంలో విమానంలో కొవిడ్ నిబంధనలు పదే పదే ఉల్లంఘించిన వారిని ‘నిషేధిత జాబితాలోని ప్రయాణికుడి’గా పరిగణించాలి. సదరు విమానయాన సంస్థ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.