సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం
అప్రతిహతం ఈ గురు పరంపర. వైదిక మార్గంలోని ఆటంకాలను తొలగించడానికి దేవతాంశలే జగద్గురువులుగా వెలిశాయి. యుగాల కిందట పరమశివుడు దక్షిణామూర్తిగా అవతరించి జగద్గురువయ్యాడు. మళ్లీ ఈ యుగంలో కొడిగడుతున్న సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆ శంకరుడే ఈ ఆదిశంకరులుగా అవతరించారు.
సనాతన ధర్మం పరిరక్షణకు దేశం నలుదిశలా శృంగేరి, పూరి, బదరి, ద్వారకలో పీఠాలను స్థాపించారు. శృంగేరిని సర్వోన్నత పీఠంగా పేర్కొన్నారు. తన శిష్యులను పీఠాధిపతులుగా నియమించి గురు పరంపరకు నాంది పలికారు. దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరికి తన శిష్యుడైన సురేశ్వరాచార్యులను పీఠాధిపతిగా నియమించారు. నాటినుంచి 36 మంది యతిశేఖరులు శృంగేరి శారదా పీఠాన్ని అలంకరించారు. జగద్గురువులుగా ప్రకాశించారు. ధర్మస్థాపనలో తమదైన కృషితో జాతిని ప్రభావితం చేసిన జగద్గురువుల్లో కొందరి ప్రస్తావన ఇది.
విద్యారణ్య తీర్థ మహాస్వామి (1380-1386)
12వ జగద్గురువులుగా శృంగేరి పీఠాన్ని అధిరోహించారు. సనాతన ధర్మాన్ని రక్షించే సంకల్పంతో తన తపోశక్తితో ఏకంగా ఓ రాజ్యాన్నే స్థాపింపజేశారు. ఎందరో రాజులు స్వామిని దర్శించి వారికి పట్టుపీతాంబరాలు సమర్పించి వాటిని ధరించాలని కోరేవారట. భక్తుల కోరికను మన్నించిన స్వామివారు దసరా నవరాత్రుల్లో బంగారు జరీ అంచున్న కాషాయం
ధరిస్తానని చెప్పారట. నేటికీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో జగద్గురువులు బంగారు అంచున్న కాషాయాంబరం ధరించడం గమనించవచ్చు.
వృద్ధ నృసింహభారతి మహాస్వామి (1817-1879)
32వ జగద్గురువులు వృద్ధ నృసింహభారతి మహాస్వామి. బాల్యంలోనే కాశీపురికి వెళ్లి వేదాధ్యయనం చేశారు. పసిపిల్లలను హింసించిన కంసుడిని చంపిన కృష్ణుడి అంశగా నృసింహభారతి స్వామిని భావించేవారు. నేటికీ అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడే చిన్నారులను వారి తల్లిదండ్రులు శృంగేరిలోని నృసింహభారతి అధిష్ఠానానికి తీసుకొస్తుంటారు.
సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి (1879-1912)
33వ జగద్గురువులు సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి. ఎనిమిదేండ్లకే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. అనేక ఆధ్యాత్మిక రచనలు చేశారు. కాలడిలో ఆదిశంకరుల జన్మస్థలిని గుర్తించి అక్కడ శారదాంబ, ఆదిశంకరుల ఆలయాలను నిర్మింపజేశారు. శంకర భగవత్పాదుల రచనలన్నిటినీ కలిపి‘శంకర గ్రంథావళి’ పేరుతో ప్రచురించారు.
చంద్రశేఖర భారతి మహాస్వామి (1912-1954)
34వ జగద్గురువులు చంద్రశేఖర భారతి మహాస్వామి. సాధనతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించేవారు ఆయన. తన తపోశక్తిని భక్తులకు అనుగ్రహించే వారు. ఆయనను దర్శించిన వ్యక్తులు ఇప్పటికీ ఆ లీలలు గొప్పగా చెప్పుకొంటూ ఉంటారు. ఆశ్రమ నిర్వహణలో పలు మార్పులు చేశారు.
అభినవ విద్యాతీర్థ మహాస్వామి (1954-1989)
శారదా పీఠానికి 35వ జగద్గురువులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. కుండలినీ యోగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ధర్మ ప్రచారానికి అనువుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శారదా పీఠం శాఖలు ఏర్పాటు చేశారు. ఆశ్రమానికే పరిమితమైన చంద్రమౌళీశ్వర ఆరాధనను చూసే భాగ్యం భక్తులకూ కల్పించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
-గౌరీభట్ల రుక్మిణీ బాలముకుంద శర్మ, అష్టావధాని