వార్సా: స్ప్రింటర్ క్రిస్టిసినా సిమనౌస్కాయా తెలుసు కదా. మొన్న టోక్యో ఒలింపిక్స్లో కోచ్లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకుగాను ఆమెను బలవంతంగా గేమ్స్ నుంచి తప్పించింది బెలారస్ ( Belarus ) టీమ్. తిరిగి ఇంటికి పంపించడానికి ఆమెను ఎయిర్పోర్ట్కు కూడా తీసుకెళ్లినా.. ఆమె స్వదేశానికి వెళ్లడానికి నిరాకరించింది. తాను పోలాండ్లో ఆశ్రయం పొందడానికి అనుమతి కోరింది. ఇప్పుడా సిమనౌస్కాయానే తాను 2019 యురోపియన్ గేమ్స్లో గెలిచిన మెడల్ను వేలం వేస్తోంది. గతేడాది బెలారస్ ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోను ఎదిరించి కష్టాల పాలైన అథ్లెట్లను ఆదుకోవడానికే తాను ఈ మెడల్ వేలం వేస్తున్నట్లు ఆమె చెప్పింది.
ఈబేలో ఈ మెడల్ వేలానికి పెట్టగా.. సోమవారం ఉదయం వరకూ 5200 డాలర్ల బిడ్ దాఖలైంది. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న సిమనౌస్కాయా.. తన కోచ్ల నిర్లక్ష్యాన్ని పబ్లిగ్గా విమర్శించింది. తనకు చెప్పకుండా 4×400 మీటర్ల రిలే టీమ్లో ఆమె పేరును చేర్చారు. దీనిని నిలదీయడంతో ఆమె 200 మీటర్ల పరుగులో పాల్గొనడానికి ఒక రోజు ముందు గేమ్స్ నుంచి తొలగించి స్వదేశానికి పంపించే ప్రయత్నం బెలారస్ టీమ్ చేసింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకోను ఎదిరించి జైలు పాలైన లేదా ఆటలకు దూరమైన అథ్లెట్ల కోసం పోరాడుతున్న బెలారిసియన్ స్పోర్ట్ సాలిడారిటీ ఫౌండేషన్.. ఇప్పుడామె మెడల్ను వేలానికి ఉంచింది.