హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్తో ఇండియా తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. చాలా మంది రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన ఔదార్యాన్ని చాటింది. 10 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు వేల ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ఇవాళ బీసీసీఐ ప్రకటన చేసింది. రానున్న కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా ఈ సిలిండర్లను సరఫరా చేయనున్నట్లు బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. మహమ్మారి వల్ల ఏర్పడ్డ విపత్తును కొంత వరకు తగ్గించే ప్రయత్నం చేయనున్నట్లు క్రికెట్ బోర్డు పేర్కొన్నది. వైరస్తో జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో మెడికల్, హెల్త్కేర్ వర్కర్లు చేస్తున్న పోరాటం అసామాన్యమైనదని, వైద్య సిబ్బంది నిజంగానే ఫ్రంట్లైన్ యోధులని, తాము ఇవ్వబోయే ఆక్సిజన్ సిలిండర్లతో బాధితులకు తక్షణమే రిలీఫ్ వస్తుందని, వారు త్వరగా కోలుకునేందుకు దోహదపడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. వైరస్పై పోరులో భుజం, భుజం కలిసి పోరాడుతామని, ఈ సంక్షోభ సమయంలో వైద్యపరికరాల అవసరాన్ని బీసీసీఐ గుర్తిస్తుందని, తాము చేసే సాయం కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. అర్హులైనవారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు.