న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరనున్న రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లను ఆహ్వానించింది. 2022 ఐపీఎల్ ఎడిషన్ పది టీమ్లతో ఆడాలని బీసీసీఐ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ సీజన్లో పాల్గొనబోయే జట్ల కోసం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం బిడ్లను పిలిచినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం ఏదైనా సంస్థ రూ.10 లక్షలు విలువ చేసే టెండర్ను కొనుగోలు చేసి దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 5 ఆఖరి తేదీగా ప్రకటించిన బోర్డు…కొనుగోలు మొత్తాన్ని నాన్ రిఫండబుల్ అని ప్రకటించిం ది. అయితే తొలుత ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ.1700 కోట్లు అనుకున్న బీసీసీఐ..కనీస ధరను రూ 2వేల కోట్లకు పెంచింది. నిబంధనలకు అనుగుణంగా టెండర్ దాఖలు చేసే కంపెనీకి ఫ్రాంచైజీ సొంతం కావచ్చు. మొత్తంగా రెండు జట్ల ద్వారా దాదాపు రూ.5వేల కోట్లు ఆర్జించాలనే లక్ష్యంతో బోర్డు కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే కొత్తగా రానున్న రెండు జట్లలో ఒకటి అహ్మదాబాద్ నుంచి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.