ముంబై: ఐపీఎల్కు సంబంధించి కొత్త బ్లూప్రింట్ను సిద్దం చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగా రెండు కొత్త ఫ్రాంచైజీలు, ప్లేయర్ రిటెన్షన్, మెగా వేలం, ఫ్రాంచైజీల జీతాల మొత్తం పెంచడం, మీడియా హక్కుల టెండర్ వంటి అనేక అంశాలు ఉన్నాయి. మెగా వేలానికి ముందు ప్రస్తుతం ఫ్రాంచైజీలకు ఉన్న జీతాల పరిమితిని రూ.90 కోట్లకు పెంచాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత మూడు సీజన్లలో ఈ మొత్తాన్ని రూ.100 కోట్లకు పెంచనున్నారు. ఈ మొత్తంలో టీమ్స్ కనీసం 75 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇక రిటేనర్ విధానానికి సంబంధించి ఒక్కో ఫ్రాంచైజీకి గరిష్ఠంగా నలుగురు ప్లేయర్స్ను రిటేన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అందులో ముగ్గురు ఇండియన్స్, ఒక విదేశీ ప్లేయర్ లేదా ఇద్దరేసి ఇండియన్, విదేశీ ప్లేయర్స్ ఉండవచ్చు. రిటేనర్లను బట్టి వేలానికి ముందు వాళ్ల పరిమితిలో నుంచి కోత విధిస్తారు. ఈసారి కొత్త ఫ్రాంచైజీలు వస్తుండటం, జీతాల పరిమితి పెంచడంతో వేలంలో కొందరు ప్లేయర్స్కు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
పోటీలో హైదరాబాద్ కంపెనీ
కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి ఆగస్ట్ నెలలో టెండర్లను ఆహ్వానించనున్నారు. వాటిని చెక్ చేసి అక్టోబర్ మధ్యలో బిడ్లను తెరవనున్నారు. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం నాలుగు కంపెనీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. కోల్కతాకు చెందిన ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్, అహ్మదాబాద్ నుంచి అదానీ గ్రూప్, హైదరాబాద్ నుంచి అరబిందో ఫార్మా లిమిటెడ్, గుజరాత్ నుంచి టొరెంట్ గ్రూప్ పోటీలో ఉన్నాయి.
ఇక మీడియా హక్కుల కోసం కూడా బీసీసీఐ ప్రత్యేకంగా వేలం నిర్వహించనుంది. ఈ ఏడాది చివర్లో ఇది జరిగే అవకాశం ఉంది. పది టీమ్స్ కావడంతో మ్యాచ్ల సంఖ్య 90కి పెరగనుంది. దీంతో అందుకు తగినట్లే మీడియా హక్కుల విలువ కూడా కనీసం 25 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.