ముంబై: మేటి అథ్లెట్.. ద ఫ్లయింగ్ సిక్కుగా ఖ్యాతి గాంచిన మిల్కా సింగ్ మృతి పట్ల బీసీసీఐ నివాళి అర్పించింది. మిల్కా మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. భారత్కు చెందిన అతిగొప్ప క్రీడాకారుడు మిల్కా సింగ్ అని, భారతీయ యువత అథ్లెటిక్స్ వైపు మళ్లేందుకు మిల్కా ప్రేరణగా నిలిచారని, అతనితో సన్నిహిత పరిచయం ఉన్నట్లు సౌరవ్ తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా నివాళి అర్పించారు. మిల్కా మృతి విషాదాన్ని మిగిల్చిందని, తరతరాలు ఎంతో మంది క్రీడాకారులకు మిల్కా ప్రేరణగా నిలిచారని, అసాధ్యం అంటూ ఏదీ లేదని ఆయన నిరూపించారని, మిల్కా మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు జే షా చెప్పారు. ఏషియా క్రీడల్లో స్ప్రింట్ విభాగంలో మిల్కా నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు. రోమ్ ఒలింపిక్స్లో రెప్పపాటులో కాంస్య పతకాన్ని మిస్సయ్యాడు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ రవిశాస్త్రి కూడా మిల్కా మృతి పట్ల నివాళి అర్పించారు.