ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ దేశవాళీ క్రికెటర్లకు గుడ్న్యూస్ చెప్పింది. వాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచుతున్నట్లు బోర్డు కార్యదర్శి జే షా సోమవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. సీనియర్ ప్లేయర్స్కు, అండర్ 23, అండర్ 19 క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను బోర్డు పెంచింది. 40 మ్యాచ్లకుపైగా ఆడిన అనుభవం ఉన్న సీనియర్ దేశవాళీ క్రికెటర్లకు ఇక నుంచి ఒక రోజు మ్యాచ్ ఫీజును రూ.60 వేలకు పెంచినట్లు జే షా చెప్పారు. ఇన్నాళ్లూ వీళ్లు రంజీ ట్రోఫీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటే మ్యాచ్ రోజు రూ.35 వేలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దానిని రూ.60 వేలకు పెంచారు.
ఇక అండర్ 23 క్రికెటర్లకు రూ.25 వేలు, అండర్ 19 క్రికెటర్లకు రూ.20 వేలు మ్యాచ్ ఫీజుగా ఇవ్వనున్నట్లు జే షా వెల్లడించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే క్రికెటర్లకు రూ.17500 ఇస్తున్నారు. తుది జట్టులో ఆడే ప్లేయర్స్కు ఈ మ్యాచ్ ఫీజు ఇస్తుండగా.. రిజర్వ్ ప్లేయర్స్ ఇందులో సగం మొత్తం అందుకుంటారు. ఇక గతేడాది కరోనా కారణంగా దేశవాళీ సీజన్ నష్టపోవడంతో క్రికెటర్లకు పరిహారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. 2019-20 సీజన్ ఆడిన క్రికెటర్లకు 2020-21 సీజన్లో 50 శాతం అదనంగా చెల్లించనున్నట్లు కూడా జే షా ప్రకటించారు.