ముంబై: ఆటగాళ్లకు కరోనా సోకుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు లీగ్లో పాల్గొన్న వాళ్లందరినీ తిరిగి పంపే పనిలో నిమగ్నమైంది. అందరినీ సురక్షితంగా ఇంటికి పంపేందుకు తమ అధికార పరిధిలో చేయాల్సిందంతా చేస్తామని బోర్డు హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఆస్ట్రేలియా.. భారత్ నుంచి వచ్చే విమానాలపై ఈ నెల 15 వరకూ నిషేధం విధించింది. లీగ్లో మొత్తం 14 మంది ప్లేయర్స్తోపాటు రికీ పాంటింగ్, హస్సీ సోదరులు, మాథ్యూ హేడెన్, లిసా స్టాలేకర్లాంటి ఆస్ట్రేలియా దేశస్తులు చాలా మందే ఉన్నారు.
వీళ్లను ఆస్ట్రేలియా పంపించడం బోర్డుకు అంత సులువైన పని కాదు. టోర్నీ మొత్తం ముగిసిన తర్వాత అయితే అప్పటికి నిషేధం ఎత్తేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాగోలా వెళ్లొచ్చులే అని ప్లేయర్స్ భావించారు. కానీ సడెన్గా మధ్యలోనే వాయిదా పడటంతో ఆసీస్ ప్లేయర్స్కు ఎటూ పాలుపోని స్థితి ఏర్పడింది.
అంతకుముందు ఐపీఎల్ జనరల్ కౌన్సిల్తోపాటు బీసీసీఐ అధికారులు అత్యవసరంగా సమావేశమై లీగ్ను వాయిదా వేయాలని నిర్ణయించారు. సన్రైజర్స్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ ప్లేయర్ అమిత్ మిశ్రా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బోర్డులోని అందరు సభ్యులు, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లతో చర్చించి ఏకగ్రీవంగా టోర్నీని వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.