కల్యాణలక్ష్మి ప్రతి ఇంట వరంగా మారింది. నిరుపేద ఆడబిడ్డల వివాహానికి అండగా నిలుస్తోంది. అలా ప్రతి ఇంట ఈ పథకం వెలుగులు నింపుతోంది. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని రేకొండ గ్రామానికి చెందిన చెంచాల మన్నెమ్మ, సదయ్య దంపతులకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిలిద్దరికీ ఇటీవలే వివాహం జరిపించారు. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవడంతో.. ఆ కవలలకు చెక్కులు మంజూరయ్యాయి. ఇద్దరు కూతుళ్లకు రూ. 2,00,232 మంజూరు కావడంతో.. ఆ రెండు చెక్కులను చూసి తల్లి మన్నెమ్మ మురిసిపోయింది. హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ చేతుల మీదుగా ఆ చెక్కులను మన్నెమ్మ అందుకున్నారు.
ఈ సందర్భంగా మన్నెమ్మ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో వరంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో ఇంత పెద్ద సహాయం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని మన్నెమ్మ ఆనంద భాష్పాలు రాల్చారు.