సువా: కరోనా వైరస్ అనేక రూపాలు సంతరించుకుని విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం వివిధ దేశాలు కొవిడ్ నిబంధనలను కఠినం చేస్తున్నాయి. అదేవిధంగా వ్యాక్సినేషషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశాయి. అయినా వ్యాక్సిన్లు తీసుకునేందుకు చాలా మంది వెనుకాడుతున్నారు. అయితే, అలాంటి వారి విషయంలో చాలా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
తాజాగా ఫిజీ దేశం కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. ‘టీకాలు తీసుకోకపోతే, ఉద్యోగాలు ఉండవు’ అంటూ హెచ్చరించింది. ‘ప్రభుత్వ ఉద్యోగులంతా ఆగస్టు 15 నాటికి టీకా మొదటి డోసు తీసుకోకపోతే సెలవుపై వెళ్లాలి. నవంబర్ ఒకటికల్లా రెండో డోసు వేయించుకోపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం. అలాగే ప్రైవేటు ఉద్యోగులు ఆగస్టు ఒకటికల్లా మొదటి డోసు వేయించుకోవాలి. లేకపోతే వ్యక్తిగతంగా భారీ జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుంది. NO JABS, NO JOBS (టీకాలు తీసుకోకపోతే..ఉద్యోగాలు ఉండవు)’ అని ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమారామా హెచ్చరించారు.
దేశంలో ఒకవైపు డెల్టా వేరియంట్తోతోపాటు మరికొన్ని కొత్త రకాలు విజృంభిస్తుంటే.. కొవిడ్ నిబంధనల విషయంలో ప్రజల నిర్లక్ష్య వైఖరి ఫిజీ ప్రభుత్వాన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోందని, అందుకే కఠిన నిర్ణయం చేయాల్సి వచ్చిందని ఫిజీ ప్రధాని తెలిపారు. కాగా, మొత్తం సుమారు 9 లక్షల మంది జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకు దాదాపు 3,40,000 మంది వయోజనులు టీకా మొదటి డోసు వేయించుకున్నారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో 8,600 కేసులు, 48 మరణాలు సంభవించాయి.