టోక్యో: జపాన్లో జూలైలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ క్రీడా పోటీలను వీక్షించాలనుకునే ప్రేక్షకులు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్తో స్టేడియానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ జరుగుతున్న వేదికల వద్దకు వెళ్లాలంటూ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ఇవాళ జపాన్ మీడియా పేర్కొన్నది. మెగా ఈవెంట్కు ముందు వారం రోజుల లోపు తీసిన పీసీఆర్ పరీక్ష రిపోర్ట్ను ప్రేక్షకులు స్టేడియాలకు తీసుకురావాలని ఓ పత్రిక ప్రచురించింది. ఒకవేళ సదరు ప్రేక్షకుడు అంతకుముందే వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే.. పీసీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదని ఆ కథనంలో తెలిపారు. క్రీడలను వీక్షించాలనుకుంటున్న ప్రేక్షకులు తమ స్వంత ఖర్చుతోనే పీసీఆర్ టెస్ట్లు చేయించుకోవాలని కథనంలో రాశారు. అయితే వేదికల్లోకి స్థానిక ప్రేక్షకులకు అనుమతి కల్పిస్తారా లేదా అన్న విషయంపై టోక్యో ఒలింపిక్ నిర్వాహకులు క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో.. టోక్యోతో పాటు మరికొన్ని జిల్లాలో జూన్ 20వ తేదీ వరకు ఎమర్జెన్సీ విధించారు.