దుబాయ్: ఇండియాలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్ 17 నుంచి జరగాల్సిన టీ20 వరల్డ్కప్( T20 World Cup ) యూఏఈకి తరలిపోయిన విషయం తెలుసు కదా. అయితే వీటి ఆతిథ్య హక్కులు మాత్రం ఇప్పటికీ బీసీసీఐతోనే ఉన్నాయి. దీంతో కనీసం టీ20 వరల్డ్కప్ ఫైనల్కు అయినా స్టేడియం పూర్తి సామర్థ్యానికి అనుమతించాలని బీసీసీఐతోపాటు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ యూఏఈ అధికారులను కోరాయి. నవంబర్ 14న జరగబోయే ఫైనల్కు 25 వేల మందిని అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికోసం అక్కడి అధికారుల అనుమతి తప్పనిసరి.
దీంతో రెండు బోర్డులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయని, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్కు అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో మాత్రమే ఫ్యాన్స్కు అనుమతిస్తున్నారు. దుబాయ్ స్టేడియానికి వచ్చే అభిమానులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధన ఉంది.
అటు షార్జాలో అయితే 16 ఏళ్లు నిండిన వారినే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా 48 గంటలలోపు చేయించుకున్న నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ కూడా తప్పనిసరి చేశారు. అటు అబుదాబిలోనూ ఇదే రూల్ ఉంది. అక్టోబర్ 24న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్తో టీ20 వరల్డ్కప్కు తెరలేవనున్న విషయం తెలిసిందే.