పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
అద్దాల్లాంటి రోడ్లు, కూడళ్లలో ఫౌంటేన్లు
8 ఎకరాల్లో ప్రకృతివనం lదాతల సహకారంతో జిమ్, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు
హైమాస్ట్ లైట్ల వెలుగుల్లో జిగేల్అండర్ డ్రైనేజీ
సకల సౌకర్యాలతో ఆదర్శంగా గ్రామం
కరీంనగర్ రూరల్, మార్చి 13 :మట్టిరోడ్లు, పాడుబడ్డ గోడలు, కూడుకుపోయిన మురుగుకాలువలతో ఏళ్లుగా నరకయాతన అనుభవించిన నగునూరు పల్లెప్రగతితో రూపురేఖలు మార్చుకున్నది. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో నయా నగిషీగా మారింది. అద్దాల్లా సీసీ రోడ్లు, ఊరికే అందం తెచ్చేలా 8 ఎకరాల్లో ప్రకృతివనం, కూడళ్లలో ఫౌంటేన్లతో మెరిసిపోతున్నది. హరితహారంతో పచ్చదనాన్ని పరుచుకొని, హైమాస్ట్ వెలుగుల్లో జిగేల్మంటూ, ఆఖరికి అవస్థలు పడకుండా వైకుంఠధామాన్ని నిర్మించుకొని ఆదర్శంగా నిలుస్తున్నది.
గతంలో నగునూరు పేరు వినగానే పాడుబడ్డ గోడలు, గుంతలు పడ్డ మట్టిరోడ్లు, పాడుబడ్డ ఇండ్లు, ఇరుకు దారులు గుర్తొచ్చేవి. ప్రస్తుతం గ్రామం దశ తిరిగింది. యేండ్ల తరబడిగా సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడ్డ నగునూరు పల్లెప్రగతితో ప్రగతి బాట పట్టింది. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో గ్రామ ముఖ చిత్రమే మార్చుకొంది. గ్రామ జనాభా 5817. 1368 ఇళ్లు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన నెలకు రూ.7 లక్షల 18 వేల నిధులు వస్తున్నాయి. ఇందులో నుంచి పంచాయతీ సిబ్బంది వేతనాలు, కరెంటు బిల్లుకు రూ. 2 లక్షలు, నీటి సరఫరాకు రూ. లక్ష ఖర్చు చేస్తున్నారు. మిగతా నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. గ్రామానికి ఏటా ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయం రూ.7.83 లక్షలు, నీటి పన్ను ద్వారా రూ. 3 లక్షలు వస్తున్నాయి. ఎస్ఎఫ్సీ నిధులు రూ.7,19,020 వస్తుండగా, వీటితో పాటు దాతల సహకారంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
కుర్మవీధిలో రూ.18 లక్షలతో, ఒడ్డెపల్లివీధిలో రూ. 8 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు, పాపగారుపల్లెలో రూ. 5లక్షలతో అండర్ డ్రైనేజీ నిర్మిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా తీగలగుట్టపల్లి నుంచి కరీంనగర్ వరకు ఉన్న పాత రోడ్డు వెడల్పుగా మారి గ్రామానికి కొత్త అందాలు తెచ్చింది. ఆరు కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. రూ. 22 లక్షలతో సకల సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మించారు. గ్రామంలో డంప్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. రైతు వేదిక పూర్తయింది. ఇంటికి రెండు చొప్పున 1400 చెత్త బుట్టలను పంపిణీ చేశారు. రెండు ప్రధాన వీధుల చౌరస్తాలో ఫౌంటేన్లు నిర్మించారు. చెత్త సేకరణకు ప్రతిమ వైద్య కళాశాల యాజమాన్యం ట్రాక్టర్ ట్రాలీతోపాటు, ట్యాంకర్ను అందించింది. గ్రామంలో మరింత అభివృద్ధికి కావాల్సిన నిధుల మంజూరుకు వైద్యశాల సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు. కంపోస్ట్ షెడ్డులో ఎరువు తయారు చేస్తున్నారు. గ్రామంలో రోడ్ల పైన ఉన్న మూడు పాడుపడ్డ బావులకు పూడ్చివేశారు. ఎస్సీ కాలనీలో శిథిలావస్థలో ఉన్న 12 ఇండ్లను గుర్తించి కూల్చివేశారు. మొదటి విడుతలో 76 తుప్పుపట్టిన విద్యుత్పోల్స్ను తీసేసి కొత్తవి వేశారు. రెండో విడుతలో 78 పోల్స్ను ఏర్పాటు చేశారు. లూజ్ వైర్లను సరిచేసి అదనంగా మరో 120 కొత్త విద్యుత్ పోల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో 1200 మొక్కలు నాటించారు. నగునూర్ నుంచి ఆరు వైపుల ఉన్న దారులకు ఇరువైపులా మొక్కలు నాటించారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 90 శాతం మొక్కలకు నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ ప్రత్యేక సిబ్బందితో సంరక్షిస్తున్నారు.
తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతి వనం
గ్రామంలో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రకృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గుట్ట ప్రాంతంలో స్థలం చదును చేసి, గుట్ట పైకి ప్రత్యేక దారి వేశారు. దాతల సహకారంతో ప్రకృతి వనానికి కంపౌండ్ వాల్, స్పోర్ట్స్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. రెస్ మిల్లర్ల సహకారంతో రూ.లక్షతో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్లో గ్రామస్తులకు ఆహ్లాదం అందించడమేకాకుండా ఫొటో షూట్ స్పాట్లా ఉండేలా సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధతో ప్రకృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
మా గ్రామాన్ని దాతల సహకారంతో ఇతర గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. పల్లె ప్రగతి నిధులు, వివిధ స్కీంల నిధులతో పల్లె ప్రకృతి వనాన్ని అందంగా ఏర్పాటు చేస్తున్నాం. వివిధ రకాల పూల మొక్కలు, వివిధ గార్డెన్ మొక్కలను తెప్పించాం. గ్రామంలో రోడ్లను వెడల్పు చేశాం. మురుగు కాల్వల నిర్మాణం చేపడుతున్నాం. మంత్రి అండదండలతో గ్రామంలో కనీస వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. మరింత మంది దాతల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటాం.