ఢాకా: ప్రపంచ క్రికెట్లో బంగ్లాదేశ్ ఇక ఎంతమాత్రమూ పసికూన కాదని నిరూపించింది. నెల రోజుల వ్యవధిలోనే ఆ జట్టు రెండు ప్రపంచ అగ్రశ్రేణి జట్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఇటీవలే ఆస్ట్రేలియాను కంగారు పెట్టించి టీ20 సిరీస్ పట్టిన బంగ్లాదేశ్.. తాజాగా న్యూజిలాండ్నూ చిత్తుచిత్తుగా ఓడించింది. కివీస్తో బుధవారం ఢాకాలో జరిగిన నాలుగో టీ20లో కివీస్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంది. తొలుత కివీస్.. 19.3 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌట్ అయింది. విల్ యంగ్ (46) ఒక్కడే రాణించగా మిగిలిన బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. బంగ్లా యువ స్పిన్నర్ నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ చెరో నాలుగు వికెట్లు తీసి కివీస్ను కోలుకోలేని దెబ్బకొట్టారు. 94 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా 32 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ మహ్మద్ నయీమ్ (29), కెప్టెన్ మహ్మదుల్లా (43*)లు ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 19.1 ఓవర్లలో బంగ్లా లక్ష్యాన్ని ఛేదించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.