హరారే: స్టార్ ఆల్రౌండర్ షకీబల్ హసన్ (96 నాటౌట్) వీరోచిత పోరాటంతో జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0తో చేజిక్కించుకుంది. ఆదివారం మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. మధెవెరె (56), కెప్టెన్ బ్రెండెన్ టేలర్ (46) రాణించారు. బంగ్లా బౌలర్లలో షరీఫుల్ ఇస్లాం 4, షకీబ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఓ మోస్తారు లక్ష్యఛేదనలో బంగ్లా ఆరంభంలోనే తడబడింది. 145 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో టెయిలెండర్ల అండతో షకీబ్ అదరగొట్టాడు. చివరి వరుస బ్యాట్స్మెన్ను రక్షించుకుంటూ జింబాబ్వేపై ఎదురుదాడికి దిగాడు. దీంతో బంగ్లా 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో షకీబ్ తర్వాత అత్యధిక స్కోరు తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన సైఫుద్దీన్ (28 నాటౌట్)దే కావడం గమనార్హం.