దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్
కలెక్టర్తో కలిసి శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
తాంసి, మార్చి 18 : రైతులు పండించిన ప్రతి పంటనూ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగుకు పెట్టుబడితో పాటు, సకాలంలో విత్తనాలు ఎరువుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. శనగ పంటను దళారులకు విక్రయించి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం శనగలను క్వింటాల్కు రూ.5100కు మద్దతు ధర చెల్లిస్తున్నారని తెలిపారు. పత్తి, సోయాబీన్, కంది, శనగ పంటల కోసం ప్రభు త్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో శనగల కొనుగోలు కోసం 9 కేంద్రాలను ఏర్పాటు చేసి, లక్ష క్వింటాళ్లు కొంటామని తెలిపారు. అనంతరం రైతులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే, జిల్లా అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు బంధు సమతి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, మార్క్ఫెడ్ డీఎం పుల్లయ్య, అధికారులు పాల్గొన్నారు.