ముంబై : కరోనా డ్రగ్ రెమ్డిసివిర్ సరఫరాపై నెలకొన్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా పాలక శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కరోనా వైరస్ ను గుర్తిస్తే దాన్ని ఫడ్నీవస్ నోటిలోకి పంపిస్తానని సేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొవిడ్ రోగులకు చికిత్సలో కీలక ఔషధంగా వాడుతున్న రెమ్డిసివిర్ ను నిల్వ చేసినందుకు ఫార్మా కంపెనీ ఉన్నతోద్యోగిని ముంబై పోలీసులు ప్రశ్నించడం పట్ల దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మహారాష్ట్రలో పాలక సంకీర్ణ నేతలు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు.
మహమ్మారి వ్యాపిస్తున్న ఈ సమయంలో ఫడ్నవీస్ సీఎంగా ఉంటే ఏం చేసేవారని శివసేన ఎమ్మెల్యే గైక్వాడ్ ప్రశ్నించారు. విపత్తు వేళ ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుందా అని బీజేపీ నేతలు వేచిచూస్తున్నారని మండిపడ్డారు. తనకు కరోనా వైరస్ కనిపిస్తే దాన్ని తాను ఫడ్నవీస్ నోట్లోకి పంపుతానని గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి, రెమ్డిసివిర్ ఇంజక్షన్లపై దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ నేతలు ప్రవీణ్ దరేకర్, చంద్రకాంత్ పాటిల్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని సేన ఎమ్మెల్యే దుయ్యబట్టారు.