సిద్దిపేట, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు మీదున్నది. పలు వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందుతున్న సంకేతాలను బట్టి చూస్తే కారు హవా కొనసాగినట్లు స్పష్టమవుతున్నది. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు సిద్దిపేటకు చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కీలకంగా మారాయి. మంత్రి హరీశ్రావు నాలుగు రోజుల పాటు సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించి, చేపట్టిన అభివృద్ధిని వివరించారు. చాలా చోట్ల ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు టీఆర్ఎస్కే ఓటు వేస్తామంటూ స్పష్టంగా చెప్పడమే కాకుండా పోలింగ్ అనంతరం కూడా అదే ట్రెండ్ కనిపించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ కూడా పోటీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.
3న ఎన్నికల ఫలితాలు
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓటరు తీర్పును బ్యాలెట్ బాక్స్ల్లో భద్రపరిచారు. ఇప్పుడు అందరి దృష్టి 3న ప్రకటించే ఫలితాలపై పడింది. సిద్దిపేటలో 43 వార్డులు ఉండగా టీఆర్ఎస్-43, బీజేపీ-40, సీపీఐ-1, సీపీఎం-1, కాంగ్రెస్-30, ఎంఐఎం-4, ఇతర రిజిస్టర్ పార్టీ-1, స్వతంత్రులు-116 మొత్తం 236 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాగా ఆయా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అభ్యర్థులు తమతమ అనుచరులతో ఆరా తీస్తున్నారు. జయాపజయాలపై బేరీజు వేసుకుంటున్నారు.