న్యూఢిల్లీ: ఐపీఎల్-14వ సీజన్లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన రాకపోకలను నిషేధించడంతో.. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత మాల్దీవుల నుంచి ఆసీస్ వెళ్లిన ఆటగాళ్లు.. సోమవారం క్వారంటైన్ ముగించుకొని కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఇంటికి చేరుకోగానే తన కూతుర్లను హత్తుకున్న వీడియోను సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, జే రిచర్డ్సన్తో పాటు కామెంటేటర్లు, సహాయక సిబ్బంది కూడా సామాజిక మాధ్యమాల్లో తమ ఆనందం వ్యక్తం చేశారు. యూఏఈలో జరిగే ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ మ్యాచ్ల్లో తమ ఆటగాళ్లు ఆడాలా వద్దా అనే అంశంపై ఇంకా చర్చలు ప్రారంభించలేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సోమవారం చెప్పింది. ఆ విషయంపై ఇప్పుడే చెప్పలేమని తెలిపింది.