సీపీ సత్యనారాయణ
వాహనాలు సీజ్
ఫర్టిలైజర్సిటీ, మే 31: రామగుండం కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గోదావరిఖనిలో లాక్డౌన్ను సీపీ సోమవారం ఆకస్మికంగా పర్యవేక్షించారు. మధ్యాహ్నం తర్వాత తిరుగుతున్న వాహనాలు ఆపి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాటిని సీజ్ చేసి స్టేషన్కు పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మధ్యాహ్నం 2 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలు సీజ్ చేస్తున్నామని వివరించారు. లాక్డౌన్కు సహకరిస్తున్న రెండు జిల్లాల ప్రజలు, వ్యాపారులకు అభినందనలు తెలిపారు. సీపీ వెంట డీసీపీ రవీందర్, ఓఎస్డీ శరత్ చంద్ర, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ ఉమేందర్, వన్ టౌన్ సీఐ రమేశ్బాబు, రాజ్కుమార్, ప్రవీణ్కుమార్, ఎస్ఐ ఉమాసాగర్, ప్రవీణ్, రమేశ్ ఉన్నారు. అలాగే గోదావరిఖని వంతెన వద్ద చెక్పోస్టును ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్ మధ్యాహ్నం తనిఖీ చేశారు. వాహనాలను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎస్ఐ సూర్యనారాయణ ఉన్నారు.
పెద్దపల్లి జంక్షన్ మే 31: పెద్దపల్లి పట్టణంలోని మసీద్ చౌరస్తాలో లాక్డౌన్ అమలు తీరును డీసీపీ రవీందర్ పరిశీలించారు. ఇక్కడ సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్, ఎస్ఐలు రాజేశ్, సహదేవ్ సింగ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
స్వీట్హౌస్ యజమానిపై కేసు
మంథని టౌన్, మే 31: పట్టణంలోని పాత పెట్రోల్ బంకు చౌరస్తాలో లాక్ డౌన్ సమయం లో షెటర్ మూసి ఉంచి లోపల విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర స్వీట్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు మంథని సీఐ సతీశ్ తెలిపారు. సీఐ వెంట ఎస్ఐ చంద్రకుమార్ ఉన్నారు.