ముంబై , జూన్ ,18: వెహికల్ లోన్ తీసుకొని జీపీఎస్ పరికరాలు కొన్న వినియోగదార్లకు హెచ్డీఫ్సీ బ్యాంకు శుభవార్త అందించింది. జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు కమీషన్లను తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. 2013-14 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం మధ్య వాహన రుణాలు పొందిన వినియోగదారులతో హెచ్డీఫ్సీ బ్యాంకు జీపీఎస్ పరికరాలను కొనుగోలు చేయించింది. ఆయా పరికరాల విక్రయాల రూపంలో కమీషన్ పొందింది. అయితే వాహన రుణాల్లో అవకతవకలు జరిగినట్లు విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది.
30రోజుల్లో జమ…
వాహన రుణాలు తీసుకొని, జీపీఎస్ పరికరాలను కొనుగోలు చేసిన వారికి కమీషన్లను బ్యాంకు వద్ద నమోదైన కస్టమర్ల ఖాతాలకు వచ్చే 30రోజుల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని హెచ్డీఫ్సీ బ్యాంకు స్పష్టం చేసింది. వీటికి సంబంధించి కస్టమర్లు బ్యాంకు శాఖలను సంప్రదించవచ్చునని తెలిపింది. వాహన రుణ దరఖాస్తును ఆమోదించే సమయంలో కస్టమర్తో రూ.18,000 విలువ చేసే జీపీఎస్ పరికరాన్ని హెచ్డీఫ్సీ బ్యాంకు కొనుగోలు చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనల మేరకు బ్యాంకులు ఇతర ఉత్పత్తులను విక్రయించరాదు. అయితే అందుకు విరుద్ధంగా జీపీఎస్ పరికరాలను కొనుగోలు చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన హెచ్డీఫ్సీ బ్యాంకు సీఈవో ఆదిత్య పురి గత ఏడాది తమ బృందం వాహన రుణ పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు అంగీకరించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో జరిమానా విధించింది ఆర్బీఐ. దీంతో జీపీఎస్ డివైజ్ కమిషన్ను వెనక్కి ఇస్తున్నట్లు హెచ్డీఫ్సీబ్యాంకు తెలిపింది.