ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సూచించారు. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణికుల విమానాల రాకపోకలను మే 15 వరకు నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. ఆసీస్ క్రికెటర్లు భారత్లో ఐపీఎల్లో ఆడుతున్న నేపథ్యంలో మోరిసన్ స్పందించారు.
‘వారు అక్కడికి ప్రైవేట్గా వెళ్లారు. ఇది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించినది కాదు. వాళ్లందరికీ సొంత వనరులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆటగాళ్లందరూ సొంత ఏర్పాట్లు చేసుకొని తిరిగి స్వదేశానికి వస్తారని అనుకుంటున్నట్లు’ మోరిసన్ పేర్కొన్నారు. మొత్తం 14 మంది ఆసీస్ ఆటగాళ్లు ప్రస్తుతం లీగ్లో పాల్గొన్నారు.
భారత్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఇండియా నుంచి తమ దేశాలకు వచ్చే ప్రయాణికుల విమానాలపై పలుదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆడుతున్న పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.