సిడ్నీ: కరోనా వైరస్ విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్కు ఆస్ట్రేలియా క్రికెటర్లు బాసటగా నిలువబోతున్నారు. కరోనా కష్టాల్లో ఉన్న భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. యునిసెఫ్ ఆస్ట్రేలియా.. ఇండియా కొవిడ్ అప్పీల్లో భాగంగా పేసర్ జోష్ లాలర్ నేతృత్వంలో గురువారం 12 గంటల పాటు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో స్టార్ క్రికెటర్లు ప్యాట్ కమిన్స్, లియాన్, స్టార్క్, హాజిల్వుడ్, హెన్రిక్స్, అలీస్సా హిలీ, రిలీ రోసో(దక్షిణాఫ్రికా) పాలు పంచుకోబోతున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 మొదలయ్యే కార్యక్రమంలో క్రికెటర్లు ఫ్యాన్స్తో కలిసి ముచ్చటించడంతో పాటు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. దీని ద్వారా లక్ష ఆస్ట్రేలియన్ డాలర్లు సేకరించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ‘ఒక ఆస్ట్రేలియా క్రికెటర్గా భారత ప్రజలతో ప్రత్యేక అనుబంధముంది. ప్రపంచంలో భారత్ అద్భుతమైన దేశం. క్రికెట్ అంటే వారికి వల్లమాలిన ప్రేమ. కరోనాతో కష్టాలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చాం’ అని లాలోర్ అన్నాడు.