న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్ లిన్ సంచలన ప్రకటన చేశాడు. వచ్చే వారమే లీగ్లోని ప్లేయర్స్ అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు అతడు చెప్పడం గమనార్హం. మంగళవారం ఓ ఆస్ట్రేలియా వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్లందరికీ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు లిన్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇందులోని విదేశీ ప్లేయర్స్కు కూడా బీసీసీఐ వ్యాక్సిన్లు ఇస్తుందా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్టర్ చేసుకుంటేనే వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కొవిడ్ కేసుల భయంతో ఇప్పటికే ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇంటికి వెళ్లిపోయిన నేపథ్యంలో క్రిస్ లిన్ చేసిన ఈ ప్రకటన సంచలనం రేపుతోంది.
మాకు తెలుసు మా కంటే కూడా చాలా మంది పరిస్థితి దారుణంగా ఉంది. కానీ మేము చాలా కఠినమైన బబుల్లో ఉన్నాము. వచ్చే వారమే వ్యాక్సిన్లు కూడా వేసుకోబోతున్నాము. ఆస్ట్రేలియా ప్రభుత్వం మమ్మల్ని ఓ ప్రైవేట్ చార్టర్లో తిరిగి రావడానికి అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాము అని లిన్ అన్నాడు.
ప్రతి ఐపీఎల్ కాంట్రాక్ట్పై క్రికెట్ ఆస్ట్రేలియాకు పది శాతం వస్తుంది. ఆ డబ్బుతో టోర్నీ ముగిసిన తర్వాత మేము చార్టర్ విమానంలో తిరిగి రావచ్చా అని నేను అడిగాను. మేమేమీ షార్ట్కట్ల గురించి అడగడం లేదు. ఈ రిస్క్లన్నీ తెలిసే సంతకాల చేశాము. కానీ టోర్నీ ముగియగానే సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లిపోతే బాగుంటుంది అని లిన్ అన్నాడు.
ఇప్పటికే ఇండియా నుంచి వచ్చే విమానాలపై మే 15వ తేదీ వరకూ ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ ముప్పును ముందే ఊహించిన ముగ్గురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇప్పటికే వెళ్లిపోగా.. వార్నర్, స్మిత్ లాంటి వాళ్లు కూడా వెళ్లిపోతారన్న వార్తలు వచ్చాయి. అంతలోపే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది.