వరంగల్ అర్బన్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని, కేసీఆరే మత నాయకుడని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల సర్పంచులు స్పష్టంచేశారు. మండలంలోని 19 గ్రామాల సర్పంచులతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకండలోని తన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా అది టీఆర్ఎస్తోనే సాధ్యమని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ గారి హయాంలోనే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న తమకు అధినేత కేసీఆర్ మాటే శిరోధార్యమని స్పష్టంచేశారు. ఎల్లప్పుడూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. మండలంలోని 22 గ్రామాల టీఆర్ఎస్ సర్పంచులకు గాను 19 మంది ఉన్నామన్నారు. మిగిలిన ముగ్గురు సర్పంచులు కరోనా సోకడం వల్ల రాలేకపోయారని చెప్పారు.