మకాయ్: తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన పోరులో ఒత్తిడిని జయించిన ఆస్ట్రేలియా విజేతగా నిలువగా.. ఆఖరి ఓవర్లో నోబాల్స్ కారణంగా భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో మిథాలీరాజ్ బృందం 5 వికెట్ల తేడాతో ఓడి 0-2తో సిరీస్ కోల్పోయింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (86; 11 ఫోర్లు) దంచికొట్టగా.. రిచా ఘోష్ (44; 3 ఫోర్లు, ఒక సిక్సర్), పూజ (29), జులన్ గోస్వామి (28 నాటౌట్) రాణించారు. మిథాలీరాజ్ (8), యషిక భాటియా (3) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో తహిలా మెక్గ్రాత్ 3, సోఫియా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా.. బెత్ మూనీ (125 నాటౌట్; 12 ఫోర్లు), తహిలా మెక్గ్రాత్ (74; 9 ఫోర్లు) రాణించడంతో సరిగ్గా 50 ఓవర్లలో 5 వికెట్లకు 275 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్కు ఇది వరుసగా 26వ విజయం కాగా.. మహిళా క్రికెట్ చరిత్రలో ఇది మూడో అత్యధిక ఛేదన. అజేయ శతకంతో ఆకట్టుకున్న మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇప్పటికే సిరీస్ ఆసీస్ వశం కాగా.. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం ఇక్కడే జరుగనుంది.
ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ఆసీస్పై ఒత్తిడి పెంచిన మిథాలీ బృందం.. దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయింది. మూనీ, తహిలా నిలకడగా ఆడటంతో కంగారూలు క్రమంగా లక్ష్యానికి చేరువయ్యారు. ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి బంతినందుకుంది. తొలి బంతికి ఓవర్త్రో ద్వారా 3 పరుగులు రాగా.. రెండో బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో లక్ష్యం 4 బంతుల్లో 8 పరుగులకు చేరింది. ఈ దశలో జులన్ వేసిన బంతి నేరుగా ఆసీస్ బ్యాటర్ హెల్మెట్కు తగలడంతో అంపైర్ నోబాల్గా ప్రకటించాడు. అదనపు బంతితో పాటు నాలుగో బాల్కు సింగిల్ రాగా.. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం ఒక బాల్ మూడు రన్స్కు చేరింది. ఆఖరి బంతికి ఆసీస్ బ్యాటర్ నికోలా క్యారీ (39 నాటౌట్) క్యాచ్ ఔటైనా.. థర్డ్ అంపైర్ పలు సమీక్షల అనంతరం నోబాల్గా ప్రకటించడంతో భారత్కు పరాజయం తప్పలేదు.
భారత్: 274/7 (స్మృతి 86, రిచా 44; తహిలా 3/45, సోఫియా 2/28),
ఆస్ట్రేలియా: 275/5 (మూనీ 125 నాటౌట్, తహిలా 74; జులన్ 1/40, మేఘన 1/38).