పాట్నా: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిన రెండున్నర ఏండ్ల తర్వాత ఒక మహిళ గర్భం దాల్చింది. దీంతో ప్రభుత్వం నుంచి పరిహారంగా రూ.11 లక్షలు డిమాండ్ చేసింది. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన ఫుల్కుమారి దేవి, దాస్ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటంతో ఆ పేద కుటుంబం ఇక పిల్లలు వద్దనుకున్నది. దీంతో 2019 జూలై 27న మోతీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దేవి కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నది.
అయితే దేవి ఇటీవల గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నలుగురు పిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినియోగదారుల కోర్టును ఆ మహిళ ఆశ్రయించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమైనందుకు పుట్టబోయే బిడ్డకు ఖర్చుల కింద పరిహారంగా రూ.11 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిలదీసినందుకు తమపట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆ దంపతులు ఆరోపించారు.
మరోవైపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ముజఫర్పూర్ సివిల్ సర్జన్ డాక్టర్ హరేంద్ర కుమార్ అలోక్ సోమవారం బదిలీకి ముందు తెలిపారు. ఈ ఆపరేషన్లు ఒక్కోసారి విఫలమవుతాయని ఆయన అన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధితురాలికి రూ.30 వేల పరిహారం చెల్లించడంతోపాటు డెలివరీ, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే ఈ లబ్ధి పొందేందుకు బాధితురాలు ఆరోగ్య విభాగాన్ని ఆశ్రయించాలని ఆయన సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.