జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ) – Handball Federation of Indiaలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఆసియా హ్యాండ్బాల్ ఫెడరేషన్ (ఏహెచ్ఎఫ్)- Asian Handball Federation ఈసందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. అసమ్మతి ప్రధాన కార్యదర్శి ప్రీత్ పాల్ సింగ్ సలూజ, ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ బాలముచిను తొలగిస్తూ ఇటీవల జరిగిన అత్యవసర ఏజీఎంలో ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన నిర్ణయాన్ని ఏహెచ్ఎఫ్ తాజాగా ఆమోదించింది.
తమ అధికారిక వెబ్ సైట్ లో హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావును ప్రకటించగా.. కార్యదర్శిగా ఉన్న సలూజ ఫొటోతో పాటు వివరాలను ఏహెచ్ఎఫ్ తొలగించింది. భారత హ్యాండ్ బాల్ లోని అంతర్గత రాజకీయాలను అర్థం చేసుకొని తనకు మద్దతుగా నిలిచిన ఆసియా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ కు ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే.. ఇటీవల లక్నోలో ముగిసిన 44వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ను విజయవంతంగా నిర్వహించినందుకు హెచ్ఎఫ్ఐను అంతర్జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య అభినందించింది.