‘సినిమా చేస్తే మొదట సంతృప్తికలగాలి. ఆ తర్వాతే డబ్బుల గురించి ఆలోచించాలి. ‘వకీల్సాబ్’తో ఈ రెండు విషయాల్లో చాలా సంతోషంగా ఉన్నాం. ప్రేక్షకుల మనసుల్ని తాకే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై పవన్కల్యాణ్ కథానాయకుడిగా శ్రీరామ్వేణు దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మించిన ‘వకీల్సాబ్’ చిత్రం ఇటీవలే విడుదలైంది. రెండోవారం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ‘థియేటర్, టీవీ, ఓటీటీల ద్వారా నిర్మాతలకు డబ్బులు వస్తుంటాయి. అది ముఖ్యం కాదు. ఓ సినిమా ఎంతమంది ప్రేక్షకులకు చేరువయిందన్నదే ప్రధానమనుకుంటా.
ఈ కరోనా టైమ్లో కూడా చాలా మంది ఈ సినిమా చూస్తున్నారు. రిపీటెడ్గా ప్రేక్షకులొస్తున్నారు. మొదటి మూడు రోజులు థియేటర్ల వద్ద క్రౌడ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ప్రభుత్వం సీటింగ్ విధానంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రేక్షకులు సినిమా చూడాలన్నదే నా అభిమతం. ఎంత డబ్బు పెడితే సినిమాకు ఎంత తిరిగొస్తుందనే విషయంలో నాకు పక్కా లెక్కలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలోనూ సక్సెస్ అందుకున్నాం. దేశంలోని ఇతర భాషా పరిశ్రమలతో పోల్చితే తెలుగు ఇండస్ట్రీ సేఫ్గా ఉందనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో 12 సినిమాలు రిలీజైతే అందులో ఐదారు చిత్రాలు విజయం సాధించాయి. ప్రతి సినిమా విజయం మనకో బాధ్యత నేర్పుతుంది. ‘వకీల్సాబ్’ విజయం మాపై మరింత బాధ్యతను పెంచింది’ అన్నారు. ‘ఈ సినిమా మహిళలకు దగ్గరైంది. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నిరూపించింది. ఈ విజయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. మా టీమ్ అందరికి కరోనా సోకిందనే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా సోకిన వారు ఆ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు’ అని దర్శకుడు శ్రీరామ్వేణు తెలిపారు.