సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్డును ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అభివృద్ధికి బెంచ్ మార్క్ చిరునామాగా సిద్దిపేటను నిలిపామన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర, జాతీయస్థాయిలో సిద్ధిపేటకు 10కి పైచిలుకు అవార్డులు వచ్చినట్లు తెలిపారు. వీటి వెనుక సిద్దిపేట ప్రజలు, అధికార సిబ్బంది కృషి ఉందన్నారు. సిద్దిపేట నెక్లెస్ రోడ్ రాష్ట్రానికే ఆదర్శమన్నారు. రూ.15 కోట్లతో సింథటిక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్యం నిమిత్తం సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.2.50 కోట్లతో త్వరలోనే ఫుట్బాల్ కోర్ట్, అదే విధంగా వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
యేడాదిలోపు రూ.25 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి నెక్లెస్ రోడ్ అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. త్వరలోనే ఇక్కడ సీసీ కెమెరాలు, మ్యూజిక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో గ్లో గార్డెన్ ప్రారంభించుకోబోతున్నట్లు తెలిపారు. వార్డు కంపోస్టు యార్డులు, వంద శాతం ఇంటింటా చెత్త సేకరణ, త్వరలోనే రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేటలో స్వచ్ఛబడిని ప్రారంభం చేసుకుంటున్నట్లు చెప్పారు. సిద్దిపేట ప్రజలకు ఉగాది పండుగ కానుకగా కోమటి చెరువుపై మ్యూజికల్ పౌంటెయిన్ను ప్రారంభిస్తామన్నారు.
చుట్టూ పక్కల జిల్లాలు, పక్క రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం వచ్చి ఇదే మోడల్ తరహాలో తమ ప్రాంతంలో అభివృద్ధి చేపడుతామని ఇక్కడ అభివృద్ధి చూసి వెళ్తున్నవారు చెబుతున్నారన్నారు. ఓ వైపు ఆహ్లాదం.. మరోవైపు ఆరోగ్యం.. సిద్దిపేట ప్రజలకు అవసరమైన అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నెక్లెస్ రోడ్ను సిద్దిపేట ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పక్కనే డే నైట్ క్రికెట్ మ్యాచ్ కోసం స్టేడియం ఏర్పాటు చేసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.