టోక్యో: భారత షూటర్లు నిరాశపరిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో అంజుమ్ ముద్గిల్, తేజస్విని సావంత్లు ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. 2018 కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ సాధించిన అంజుమ్. ఇవాళ జరిగిన ఈవెంట్లో క్వాలిఫయింగ్ రౌండ్లో 15వ స్థానంలో నిలిచింది. ఆమె 1167 స్కోర్ చేసింది. మరో షూటర్ తేజస్విని 1154 స్కోర్తో 33వ స్థానంలో నిలిచింది. అయితే కేవలం టాప్ 8 మంది షూటర్లు మాత్రమే ఈ ఈవెంట్లో ఫైనల్కు అర్హత సాధిస్తారు. యుసియా జికోవా ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసింది. 1182 స్కోర్ చేసి ఆమె ఫస్ట్ ప్లేస్లో నిలిచింది.
50మీ రైఫిల్ 3 పొజిషన్స్ పోటీల్లో.. షూటర్ మూడు రకాలుగా టార్గెట్ను షూట్ చేస్తారు. మోకాళ్లపై కూర్చుని, పూర్తిగా పడుకుని, నిలబడి.. ఇలా మూడు రకాలుగా టార్గెట్ను షూట్ చేస్తారు. ఆకాసా షూటింగ్ రేంజ్లో జరిగిన ఈవెంట్లో ఇవాళ ఉదయం అంజుమ్ మంచి స్టార్ట్ ఇచ్చింది. నీలింగ్లో పొజిషన్లో 400కు గాను 390 స్కోర్ చేసింది. ఇక ప్రోన్ పొజిషన్లో 395, స్టాండింగ్ పొజిషన్లో మాత్రం కేవలం 382 మాత్రమే స్కోర్ చేసింది.