ముంబై : కరోనా కట్టడి చర్యలను పక్కనపెట్టిన కాషాయ పార్టీ 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే దానిపై కసరత్తు సాగిస్తోందని శివసేన ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేనీ నాయకత్వం యూపీపైనే ద్రుష్టి సారించిందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో సేన పేర్కొంది. మిషన్ యూపీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంప్రదింపులు జరిపారని తెలిపింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అంతటి ప్రాధాన్యం అవసరమా అని శివసేన విస్మయం వ్యక్తం చేసింది. యూపీ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టడంలో విఫలమైన కాషాయ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతిష్టను ఎలా పెంచుకోవాలనే దానిపై కసరత్తు సాగిస్తోందని పేర్కొంది. కొవిడ్-19 కట్టడిలో ఘోరంగా విఫలమవడంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని వ్యాఖ్యానించింది. యూపీలోని గంగా నదిలో మృతదేహాలు కొట్టుకురావడం కంటనీరు తెప్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.