Avani Lekhara | టోక్యో పారాలంపిక్స్ ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ (ఎస్హెచ్1) విభాగంలో అవనీ లేఖారా రికార్డు నెలకొల్పారు. పారాలంపిక్స్ చరిత్రలోనే తొలిసారి స్వర్ణ పతకం సాధించారు. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందించారు. అంతే కాదు. ఆమెకు స్పెషల్ గిఫ్ట్ ప్రకటించారు.
వికలాంగుల కోసం తయారు చేసిన తొలి కస్టమైజ్డ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)ని ఆమెకు మహీంద్రా అండ్ మహీంద్రా అందజేస్తుందని తెలిపారు. పారాలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపా మల్లిక్ చేతుల మీదుగా ఈ స్పెషల్ ఎస్యూవీని అవనీ లేఖారాకు అందిస్తుందన్నారు. వికలాంగులు రోడ్లపై సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా స్పెషల్ ఎస్యూవీని తయారు చేస్తామని ట్వీట్ చేశారు.
టోక్యో పారాలంపిక్స్లో అవనీ లేఖారా వాడిన ఎస్యూవీ మాదిరిగానే ఎస్యూవీ కారును డెవలప్ చేయాలని తమకు వారం క్రితం దీపా మల్లిక్ సూచించారన్నారు ఆనంద్ మహీంద్రా. ఈ మేరకు వికలాంగులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఎస్యూవీని తయారు చేయాలని తమ సంస్థ డెవలప్మెంట్ హెడ్ వేలును కోరానన్నారు. తొలి వాహనాన్ని అవనీ లేఖారాకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు.
ఆనంద్ మహీంద్రా నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అథ్లెట్లకు రివార్డులు ఇచ్చి ప్రోత్సహించేందుకు మిగతా కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సోషల్మీడియాలో పలువురు కోరుతున్నారు.