న్యూఢిల్లీ: దేశం తరఫున ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావుండదని భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ చెప్పింది. తాను చాలా ఏండ్ల నుంచి ఆడుతున్నానని, ఎప్పుడూ అహం ప్రదర్శించలేదని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. 2018 టీ20 ప్రపంచకప్ సెమీస్లో తనతో వివాదం తర్వాత హెడ్కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన రమేశ్ పొవార్ మళ్లీ ఆ స్థానంలో రావడంపై స్పందిస్తూ.. తాను ఆ విషయాన్ని ఎప్పుడో వదిలేశానని, ముందుకు సాగడంపైనే దృష్టి సారిస్తున్నానని మిథాలీ చెప్పింది. ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరేందుకు ప్రస్తుతం మిథాలీ రాజ్తో పాటు భారత జట్టు ముంబైలో క్వారంటైన్లో ఉంది. ‘నేను 21 ఏండ్లుగా ఆడుతూనే ఉన్నా. నాకెప్పుడూ అహం లేదు. నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించా. భారత్ తరఫున ఆడే విషయానికి వస్తే.. దేశానికి సేవ చేస్తున్నప్పుడు వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టాల్సిందే’అని మిథాలీ చెప్పింది.