నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 30: దళితులు సంపూర్ణ సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సీఎం దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ దళిత జన బాంధవుడని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఖమ్మంలో డప్పు దరువు
ఖమ్మం జిల్లాకేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో డప్పు దరువు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు డప్పులు కొట్టి సీఎం ప్రకటించిన పథకాన్ని స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాభిషేకం చేశారు.
కేయూలో మేధోమథనం
సామాజిక వివక్ష, అణచివేతకు గురవుతున్న దళితుల జీవితాల్లో వెలుగునింపేందుకే సీఎం కేసీఆర్ దళిత్ ఎంపవర్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం’పై బుధవారం వరంగల్లోని కేయూలో మేధోమథన సదస్సు జరిగింది. దళితులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగేందుకు.. సామాజిక, ఆర్థిక బాధలు తొలగించేందకు దశలవారీగా కార్యచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ప్రొఫెసర్ పుల్లా శ్రీనివాస్, దళిత మేధావులు ఎర్రగట్టు స్వామి, బన్న అయిలయ్య, సమ్మయ్య, వెంకన్న మనోహర్, రాజ సిద్ధార్థ, బొట్ల బిక్షపతి, డేవిడ్, సుధాకర్, టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు ప్రశాంత్, ఏబీఎస్ఎఫ్ నాయకుడు నరేష్, టీఎస్ఎఫ్ఐ నాయకుడు కన్న సునిల్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంకు కృతజ్ఞతగా పాదయాత్ర
దళిత సాధికారత పథకాన్ని హర్షిస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ నల్లగొండ జిల్లా కేతేపల్లి నుంచి హైదరాబాద్కు దళిత సామాజిక వర్గాల యువకులు పాదయాత్ర చేపట్టారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వీరి పాదయాత్రను ప్రారంభించారు. దళిత సాధికారత పథకం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నదని చిరుమర్తి పేర్కొన్నారు.