జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన పట్టణం
హాలియా, మార్చి 25 : త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి రుణం తీర్చుకుంటామంటూ నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులంతా గురువారం యువ కవాతు నిర్వహించారు. సుమారు వెయ్యి మంది యువకులతో నిర్వహించిన ఈ ర్యాలీని రామగుండం ఎమ్మెల్యే, ఉప ఎన్నికల హాలియా మున్సిపాలిటీ ఇంచార్జి కోరుకంటి చందర్ ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి లక్ష్మీనర్సింహ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించగా.. జై తెలంగాణ నినాదాలతో హాలియా హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కో ఆర్డినేటర్ మల్గిరెడ్డి లింగారెడ్డి, నాయకులు యడవల్లి విజయేందర్రెడ్డి, మహేందర్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.