బెర్లిన్: దక్షిణ జర్మనీలో సోమాలి యువకుడు కత్తితో వీరంగం సృష్టించగా.. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వోర్జ్బర్గ్ నగరం నుంచి నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. అయితే నిందితుడికి ఎలాంటి గాయాలు కాలేదు. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లనే కత్తితో దాడికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ప్రాంతీయ అంతర్గత మంత్రి జోచిమ్ హెర్మాన్ సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించారు. ఈ దాడిలో ముగ్గురు మరణించారని, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని ఆయన ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి క్లిష్టంగా ఉన్నదని, దాడికి పాల్పడిన వ్యక్తి 2015 నుంచి వర్జ్బర్గ్లో నివసిస్తున్నాడని హెర్మాన్ తెలిపారు. దవాఖానలో ఉన్న నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. గత నెలల్లో అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని, కొన్నిరోజుల క్రితం మానసిక చికిత్స కోసం దవాఖానలో చేర్చించినట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో నిందితుడు.. పొడవాటి కత్తితో చెప్పులు లేకుండా ఉండటాన్ని చూడవచ్చు. పోలీసులు వచ్చే వరకు ఆ యువకుడిని నిలువరించేందుకు కుర్చీలను ఉపయోగించి స్థానికులు ప్రయత్నించారు. చనిపోయిన వారిలో బాలుడు, అతని తల్లిదండ్రులలో ఒకరు ఉన్నట్లు జర్మన్ వార్తాపత్రిక తెలిపింది. దాడికి పాల్పడిన వ్యక్తి పేరును పోలీసులు ఇంకా విడుదల చేయలేదు.