హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణను ఎండబెడతామంటే ఊరుకోబోమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీని ముమ్మాటికీ అడ్డుకుంటామని స్పష్టంచేశారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఎక్కడిదాకైనా వెళ్తామని చెప్పారు. శనివారం తెలంగాణభవన్లో పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణకు చాంపియన్ అని, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోరన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఎత్తుకెళ్తుంటే ధైర్యంగా అడ్డుకున్నది సీఎం కేసీఆరేనని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే జలచౌర్యానికి బీజం పడిందన్న సత్యాన్ని తెలంగాణ సమాజం మరిచిపోదని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడుపై వైఎస్ రాజేశేఖర్రెడ్డి దొంగలా వ్యవహరిస్తే, ఏపీ సీఎం జగన్ గజదొంగలాగా తయారయ్యారని మంత్రి వేముల చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు నిజమని నొక్కిచెప్పారు. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నదని, రాయలసీమ ఎత్తిపోతలు నిర్మిస్తున్నారని చెప్పినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుందని ఆయన ఆరోపించారు.
అన్యాయంలో తండ్రిని మించిన తనయుడు
ఏపీ సీఎం జగన్ కేంద్రానికి అబద్ధాలు చెప్తూ అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని మంత్రి పువ్వాడ మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలపై బీజేపీ నేతలు ఏపీలో ఒకలా..తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి నిజస్వరూపాన్ని బయటపెడతామని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం చేయటంలో జగన్మోహన్రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరురాష్ర్టాల ప్రజలు బాగుపడాలని, బేసిన్లు, భేషజాలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసుతో మాట్లాడితే ఆంధ్రా మంత్రులు వక్రభాష్యం చెప్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల వైఖరిని ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.