హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి స్పోర్ట్స్ అకాడమీ, వీఎమ్ టెన్నిస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఐటా అండర్-14 టెన్నిస్ టోర్నీలో శౌర్య, మనోజ్ఞ సింగిల్స్ విజేతలుగా నిలిచారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన దాదాపు 114 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడ్డారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ శౌర్య 2-6, 6-1, 6-4తో హ్రిశిక్ వావిల్పై విజయం సాధించాడు. బాలికల తుదిపోరులో మనోజ్ఞ 6-4, 6-4తో వాన్సికాపై అలవోకగా గెలిచింది. బాలుర డబుల్స్ టైటిల్ను శౌర్య, హ్రిశిక్ కైవసం చేసుకోగా, బాలికల టైటిల్ను సాన్విరెడ్డి, హన్సికా దక్కించుకున్నారు. విజేతలకు డీఎస్పీ నరసింహరెడ్డి, శ్రీనిధి అకాడమీ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ ర్యాన్ బహుమతులు అందజేశారు.