న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు సన్నాహంగా భావిస్తున్న ఆసియా చాంపియన్షిప్ కోసం భారత బాక్సింగ్ బృందం శనివారం దుబాయ్కి చేరుకుంది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సహా 30 మందితో కూడిన బాక్సింగ్ జట్టు సభ్యులు పటిష్ఠమైన బయోబబుల్ ఏర్పాట్ల మధ్య అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే బాక్సర్ల విమానానికి ల్యాండింగ్ అనుమతి లభించకపోవడంతో యూఏఈ గగనతలంపైనే దాదాపు అరగంట పాటు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. పర్యటన అనుమతి విషయంలో ఒకింత సందిగ్ధత నెలకొన్నది. అయితే యూఏఈలోని భారత ఎంబసీ అధికారులు వెంటనే స్పందించడంతో విమానం దిగేందుకు మార్గం సుగమమైంది. సోమవారం మొదలవుతున్న టోర్నీలో తెలంగాణ నుంచి మహమ్మద్ హుస్సాముద్దీన్ కూడా పోటీపడుతున్నాడు.