లాసెన్: ప్రపంచ బాక్సింగ్ టోర్నీ కొత్తకొత్తగా ఉండబోతున్నది. గతానికి భిన్నంగా ఈసారి విజేతలకు కొత్తగా పతకాలు, గ్లౌజులు, బెల్ట్లు ఇవ్వనున్నారు. సంప్రదాయంగా వస్తున్న ఎరుపు, నీలి రంగును కాదని ఈసారి శ్వేత వర్ణంలో గ్లౌస్లు ఇవ్వనున్నారు. బెల్ట్లు సరికొత్తగా, స్వర్ణ, రజత పతకాలను అత్యంత నాణ్యతతో రూపొందించినట్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ప్రకటించింది. ఈ మార్పులతో పలు వివాదాలకు పరిష్కారం ఏర్పడిందని పేర్కొంటూ ‘బాక్సింగ్కు కొత్త ప్రారంభం’ అని ఐబా పేర్కొంది. బెల్గ్రేడ్ (సెర్బియా)లో ఈనెల 24 నుంచి జరుగనున్న ఈ టోర్నీకి గతంలో ఎన్నడూ లేని విధంగా వంద దేశాల నుంచి దాదాపు 600కు పైగా బాక్సర్లు పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని బాక్సర్లు గుర్తుంచుకునేలా ఐబా మార్పులు చేసింది. అథ్లెట్లు గొప్పగా ఆడేలా ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఐబా అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ తెలిపాడు. ఇక టోర్నీలో విజేతలకు రూ.19 కోట్ల నగదు బహుమతి దక్కనుంది.