‘ప్రేమకథలతో పాటు అభినయానికి ఆస్కారమున్న విభిన్నమైన పాత్రలతో నటుడిగా నా ప్రతిభను నిరూపించుకోవాలనుంది’ అని అన్నారు విరాజ్ అశ్విన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకుడు. ఇటీవల ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదలైంది. విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘పతాక ఘట్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయని, ఆ సన్నివేశాల్లో నా నటన ఆకట్టుకుంటుందని అందరూ ప్రశంసిస్తున్నారు. సినిమాలో నా పాత్ర నెగెటివ్ షేడ్స్తో ప్రారంభమై పాజిటివ్గా మారుతుంది. కథ చెప్పినప్పుడు నెగెటివ్ పాత్ర అయితే కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడ్డా. నటుడిగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడే సినిమా అనిపించింది. రొమాంటిక్ సీన్స్ను ఇదివరకు చేయలేదు. ఆ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బందిపడ్డా. ప్రస్తుతం ఓ రొమాంటిక్ కామెడీ చిత్రంతో పాటు ఆంథాలజీ సినిమాలో నటిస్తున్నా’ అని తెలిపారు.