మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ అనూహ్యంగా రద్దయింది. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు ఈ మ్యాచ్ రద్దయినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇండియన్ క్యాంప్లో కరోనా కారణంగా ఆ టీమ్ ప్లేయర్స్ బరిలోకి దిగడానికి సుముఖంగా లేరని ఈసీబీ తన ప్రకటనలో వెల్లడించింది. అయితే మొదటిసారి రిలీజ్ చేసిన ప్రకటనలోనే ఓ మాటను ఈసీబీ తొలగించడం గమనార్హం. ఇండియా టీమ్ను బరిలోకి దింపలేకపోతోంది. ఫలితంగా ఈ మ్యాచ్ను వాళ్లు వదులుకుంటున్నారు( forfeit the match ) అని తన తొలి ప్రకటనలో ఈసీబీ చెప్పింది. ఆ తర్వాత వెంటనే ఈ పదాన్ని తొలగించి మరో ప్రకటన రిలీజ్ చేసింది.
ఇండియన్ క్యాంప్లో మరిన్ని కరోనా కేసులు వస్తాయన్న భయంతో ఇండియా తన టీమ్ను బరిలోకి దింపలేకపోతోంది. దానికి బదులుగా మ్యాచ్ను వదులుకోవడానికి సిద్ధమైంది అని ఈసీబీ తొలి ప్రకటన చెప్పింది. ఆ వెంటనే ఈ పదాన్ని తొలగిస్తూ మరో ప్రకటనను తన ట్విటర్లో ఉంచింది. సిరీస్ ఫలితంపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ప్రస్తుతం టీమిండియా సిరీస్లో 2-1 లీడ్లో ఉన్న విషయం తెలిసిందే.