న్యూఢిల్లీ: అథ్లెటిక్స్లో తొలి ఒలింపిక్ స్వర్ణం దక్కిన రోజును ఘనంగా నిర్వహించాలని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్ణయించింది. టోక్యో విశ్వక్రీడల్లో నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించిన ఆగస్టు 7ను.. ఇక ప్రతీ ఏటా ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహించనున్నట్లు ఏఎఫ్ఐ తెలిపింది. వచ్చే ఏడాది నుంచి జావెలిన్ డే రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏఎఫ్ఐ తీసుకున్న నిర్ణయాన్ని నీరజ్ చోప్రా స్వాగతించాడు.
నేను పతకం సాధించిన రోజును ఈ విధంగా గౌరవించడం ఆనందంగా ఉంది. నన్ను ఆదర్శంగా తీసుకొని యువతరం అథ్లెటిక్స్ వైపు అడుగులు వేస్తే సంతోషిస్తా.
ఇక అదే లక్ష్యం..
జావెలిన్ త్రోలో ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన నీరజ్ చోప్రా.. ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ పట్టడమే తన తదుపరి లక్ష్యమంటున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో భారత్కు తొలి అథ్లెటిక్స్ పతకాన్ని అందించిన నీరజ్.. వచ్చే ఏడాది అమెరికా వేదికగా జరుగనున్న ఈ మెగాటోర్నీ కోసం సిద్ధమవనున్నట్లు చెప్పాడు. మంగళవారం ఏఎఫ్ఐ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నీరజ్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు నెగ్గాను. తాజాగా ఒలింపిక్ పతక కోరిక కూడా తీరింది. ఇక నా తదుపరి లక్ష్యం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి పతకం కైవసం చేసుకోవడమే’ అని అన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ అథ్లెట్ అంజూబాబీ జార్జ్ .. భారత అథ్లెటిక్స్ చరిత్రలో ఇవి గర్వించదగ్గ క్షణాలని పేర్కొంది.