టోక్యో: మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటపడటానికి లక్షల మంది ప్రయత్నిస్తున్నారు. మరో దేశంలోకి వెళ్లి ఎలాగోలా బతుకీడిస్తే చాలానుకుంటున్నారు. కానీ ఆ దేశానికి చెందిన జాకియా ఖుదాదడి మాత్రం అక్కడి నుంచి బయటపడటమే కాదు.. ఏకంగా పారాలింపిక్స్లో పోటీ పడింది. గురువారం ఆమె తైక్వాండో కాంపిటిషన్లో పాల్గొన్నది. 2004 ఏథెన్స్ తర్వాత ఓ ఆఫ్ఘన్ మహిళ ఈ ఈవెంట్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. అసలు ఆమెను ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటకు తీసుకురావడానికే అంతర్జాతీయ స్థాయిలో ఓ సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. ఆమెతోపాటు హుస్సేన్ రసౌలీ అనే మరో వ్యక్తి గత శనివారం టోక్యో వచ్చారు.
గురువారం జరిగిన తైక్వాండో కాంపిటిషన్కు ఓ తెల్లటి హిజాబ్ ధరించి వచ్చింది. పారాలింపిక్స్లో తైక్వాండో పోటీలు జరగడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. 1960ల్లో ప్రారంభమైన పారాలింపిక్స్లో ఆప్ఘనిస్థాన్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా జాకియా నిలిచింది. అయితే ఆమె తాను తలపడిన రెండు మ్యాచ్లలోనూ ఓడింది. అయితే ఆమె మీడియాతో మాట్లాడలేదు. మరోవైపు రసౌలీ మెన్స్ హైజంప్లో పాల్గొన్నాడు. ఈ ఇద్దరికీ ఆస్ట్రేలియా వీసాలు జారీ చేసిందని, గేమ్స్ తర్వాత వీళ్లు అక్కడికే వెళ్తారని వీళ్లను ఆఫ్ఘన్ నుంచి బయటకు తీసుకు రావడంలో కీలకపాత్ర పోషించిన మానవహక్కుల నేత అలీసన్ బాటిసన్ చెప్పారు.