కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) పేలుళ్లపై ఆ దేశ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ దాడులపై వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో వంద మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. దీనిపై రషీద్ ఖాన్ స్పందిస్తూ.. కాబూల్ మళ్లీ రక్తమోడుతోంది. ఆఫ్ఘన్లను దయచేసి చంపడం ఆపండి అంటూ వేడుకున్నాడు. మరోవైపు మహ్మద్ నబీ కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ దాడులను ఖండించిన అతడు.. ఇలాంటి కష్ట సమయంలో ఆఫ్ఘన్లను ఆదుకోవాలని కోరాడు. తమ దేశాన్ని ఆదుకోవాలంటూ గతంలో కూడా ఒకసారి రషీద్ ఖాన్ ట్విటర్ ద్వారా ప్రపంచ నేతలను వేడుకున్న విషయం తెలిసిందే.