యువరాజ్
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్తో పోలిస్తే భారత్కు కాస్త ప్రతికూలత ఉంటుందని టీమ్ఇండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. కివీస్ ఇప్పటికే ఇంగ్లండ్తో టెస్టులు ఆడుతున్నదని, అందుకే ఆ జట్టు పరిస్థితులకు అలవాటు పడడంతో పాటు మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుందని చెప్పాడు. మరోవైపు టీమ్ఇండియా.. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగనుండడంతో కాస్త ప్రతికూలత ఉంటుందని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ అభిప్రాయపడ్డాడు. అయితే టీమ్ఇండియా చాలా పటిష్టంగా ఉందని యువీ అన్నాడు. అలాగే ఆరంభంలో స్వింగ్ అయ్యే డ్యూక్ బంతులను భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. మరోవైపు టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మూడు మ్యాచ్లుగా ఉంటే బాగుంటుందని యువీ అభిప్రాయపడ్డాడు.