న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ తర్వాత భారత క్రికెట్ జట్టు కోచ్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి ఇప్పటికే బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ ఎంపిక దాదాపు ఖరారు కాగా, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ స్థానంలో అభయ్ శర్మ రానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫీల్డింగ్ కోచ్ పోస్టుకు 52 ఏండ్ల అభయ్ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైనట్లు బోర్డు వర్గాలు ధ్రువీకరించాయి. ఢిల్లీ, రాజస్థాన్, రైల్వేస్ తరఫున అభయ్ 89 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 2016లో జింబాబ్వే, అమెరికా, వెస్టిండీస్ పర్యటనలో భారత్కు అతడు ఫీల్డింగ్ కోచ్గా పనిచేశాడు. మూడు అండర్-19 ప్రపంచకప్లు, భారత ఏ జట్టు తరఫున 10 పర్యటనల్లో పాలుపంచుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి పనిచేసిన అనుభవం అభయ్కు కలిసివచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే నవంబర్ 3వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది.