పల్లె, పట్నం తేడా లేదు..అన్నిచోట్ల పండుగ సందడే.. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళ వారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్లతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొందరు తమ ఇండ్లపై గులాబీ జెండాను ఎగురవేసి గుండెల్లో పార్టీపై తమకున్న స్థానాన్ని చాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర సాధన, పునర్నిర్మాణంతో ప్రజలకు అందుతున్న ఫలాలను వారు వివరించారు.
తాండూరు, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసేందుకు పురుడు పోసుకున్న టీఆర్ఎస్ విజయవంతంగా రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుందని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరులో టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు పండుగలా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తాండూరు నియోజకవర్గంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు బయటకు రాకుండా ఇండ్లపై టీఆర్ఎస్ జండాను ఎగురవేశారు. విలేమూన్ చౌరాస్తాలో మంత్రి సబితారెడ్డి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించగా, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి నివాసం ఎదుట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న టీఆర్ఎస్ జండాను ఎగురవేశారు. తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెల్లో పార్టీ సీనియర్ నేతలు గులాబీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ గులాబీ జండా పురుడు పోసుకోవడంతో పాటు సీఎం కేసీఆర్ సంకల్పం, విశ్వాసంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. దేశానికి ఆదర్శంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. జనహృదయ నేతగా సీఎం కేసీఆర్ ప్రజల్లో నిలిస్తే గులాబీ జెండా ప్రజల గుండెల్లో రెపరెపలాడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు.
కొత్తూరు, ఏప్రిల్ 27: పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధనకు కేసీఆర్ ఒక్కరే పోరాటం మొదలు పెట్టారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం కొత్తూరులో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ పాత్ర గొప్పదన్నారు. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా తెలంగాణ పోరాటం సాగిందన్నారు. ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 70వేలకు పైగా ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, కొత్తూరు వంటి ఎత్తైన ప్రాంతాలకు కూడా సరిపడా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారన్నారు. త్వరలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయిర్ను నిర్మించి సాగునీటిని అందిస్తామన్నారు. గ్రామపంచాయతీగా ఉన్న కొత్తూరును మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామన్నారు. ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులే గెలుస్తున్నారంటే అది సీఎం కేసీఆర్పై ఉన్న నమ్మకమే అన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో వివిధ పార్టీల నాయకులు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది యువత టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. అందరి సహకారంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతారని వివరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ , షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, టీఆర్ఎస్ సీనియర్ కాయకులు ఎమ్మె సత్యనారాయణ, నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, కొత్తూరు మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 12 వార్డుల అభ్యర్థులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.